అతనికి మొన్ననే పెళ్లయింది..
కాపురం కూడా పెట్టాడు..
ఉన్నట్టుండి ఉద్యోగం వదిలేద్దామని డిసైడయ్యాడు..
కొత్తగా పెళ్లయిన ఓ మధ్యతరగతి యువకుడు అలాంటి నిర్ణయం తీసుకోవడమేంటి?
అతనికి ఏమైనా మెంటలా? పైగా భార్య కూడా ఉద్యోగం చేయడం లేదు..!
చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు..
కానీ అతని డ్రీమ్ వేరు. లక్ష్యం వేరు. దాని కోసమే అతని తపన!
రష్మీ బన్సల్ చెప్పినట్టు స్టే హంగ్రీ, స్టే ఫూలిష్! ఎంత గొప్ప భావన!
టీవీల్లో చూసే ఉంటారు. గత వారమే లోక్ సభ ఆధార్ బిల్లును పాస్ చేసింది. తద్వారా లబ్దిదారులకు ఆర్థిక సేవలు, సబ్సిడీలు అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి మరింత సాధికారత లభించింది. ప్రస్తుతం ప్రతీ పౌరుడికి 12 అంకెల ఆధార్ కార్డు తప్పనిసరి. ఇప్పటికే దేశంలో 97 శాతం మందికి ఆధార్ కార్డులున్నాయి. రోజుకు 5 లక్షల నుంచి 7 లక్షల మంది కొత్తగా ఆధార్ కోసం ఎన్రోల్ చేసుకుంటున్నారు.
ప్రపంచం మొత్తమ్మీద కేవలం ఐదేళ్లలో 50 కోట్ల మందికి చేరువ అయిన సంస్థ ఏదైనా ఉందీ అంటే.. అది ఆధార్ ఒక్కటే! జనాల్లోకి అంతలా చొచ్చుకెళ్లడానికి అదేమీ ఫేస్ బుక్కో మరొక సోషల్ మీడియా కంపెనీయో కాదు. జస్ట్ ఒక గవర్నమెంట్ ఇనీషియేటివ్! అదే ఇక్కడ విశేషం.
ఆధార్ ఇంతలా సక్సెస్ కావడం వెనక ఒక వ్యక్తి కృషి గురించి చెప్పుకోవాలి. చురుకైన ఆలోచనలతో వ్యాపారాలను ఉన్నత శిఖరాలకు చేర్చిన ఒకప్పటి ఆంట్రప్రెన్యూర్ అతను. ఆయన మరెవరో కాదు. శంకర్ మరువాడ! ఉడాయ్(యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా)లోని డిమాండ్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ విభాగానికి మాజీ చైర్మన్. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆధార్ కు బ్రాండ్ బిల్డర్! ఆధార్ ను ఇండియాకు ఆధారంలా మార్చింది ఆయనే. శంకర్ సారథ్యంలో ఆధార్ ది ఒక విజయగాథ. నేటి ఆంట్రప్రెన్యూర్లకు ఆయన ఒక రోల్ మోడల్.
ఎత్తుపల్లాలు చూసిన మనిషి..
1999లో ఇంటర్నెట్ బూమ్ మొదలైనప్పుడే శంకర్ జర్నీ కూడా ప్రారంభమైంది. అప్నా గైడ్ డాట్ కామ్ అనే కంపెనీకి కో ఫౌండర్ గా కెరీర్ మొదలైంది. ఇప్పుడున్న జొమాటో, ట్రిప్ అడ్వైజర్ లా అది కూడా ఒక కస్టమర్ రివ్యూస్ వెబ్ సైట్. కానీ ప్రారంభమైన రెండేళ్లకే కంపెనీ మూతపడింది. అందుకు కారణాలు అనేకం అంటారు శంకర్.
నిజానికి అది ఈ టైమ్ లో పెట్టాల్సిన కంపెనీ. కానీ ఆ రోజుల్లోనే దాన్ని స్టార్ట్ చేశాం. ఇంటర్నెట్ అంతగా వినియోగంలో లేకపోవడంతో కస్టమర్లు పెద్దగా రాలేదు. దాంతో కంపెనీని తిరిగి ప్రారంభించడం కూడా సాధ్యపడలేదు- శంకర్
కానీ శంకర్ అక్కడితో ఆగిపోలేదు. తన ఫార్ములా సక్సెస్ కాకపోవడంతో ఆలోచనలో పడ్డారు. అప్పటి టైమ్ కి తగ్గట్టుగా మార్చి మరో కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు. ఒకరకంగా అది ఆయనకు సెకండ్ ఇన్నింగ్స్. 2003లో మొదలైన మార్కెటిక్స్ కంపెనీ ఏ స్థాయికి వెళ్లిందో అందరికీ తెలిసిందే. 2007లో డబ్ల్యూఎన్ఎస్ ఏకంగా 65 మిలియన్ డాలర్లు పెట్టి శంకర్ కంపెనీని కొనుగోలు చేసింది.
మార్కెటిక్స్ కంపెనీకి అంతటి రెప్యుటేషన్ ఆషామాషీగా రాలేదు. క్వాలిటీ, క్లయింట్స్ విషయంలో కచ్చితత్వంతో పనిచేశారు శంకర్. ఇతరులపై ఆధారపడకుండా సొంత టాలెంట్ నే నమ్ముకున్నారు. కస్టమర్లకు క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలన్న ఆయన కాన్సెప్ట్ వర్కవుట్ అయింది. అదే మార్కెటిక్స్ కంపెనీని ఎక్కడో నిలబెట్టింది. శంకర్ తయారు చేసిన ఆంట్రప్రెన్యూర్లంతా ఇప్పుడు గొప్ప గొప్ప పోజీషన్స్ లో ఉన్నారు. ఎంచుకున్న దారి ఎలాంటిదైనా ఎప్పుడూ రాజీ పడకూడదంటారు శంకర్ మరువాడ.
ఆధార్ తో ప్రయాణం..
శంకర్ టాలెంట్ ను ఉడాయ్ చైర్మన్ నందన్ నీలేకని గుర్తించారు. ఉడాయ్ డిమాండ్ జనరేషన్, కమ్యూనికేషన్ అండ్ అవేర్ నెస్ విభాగానికి చైర్మన్ చేశారు. నీలేకని నమ్మినట్టుగా దేశంలో ఆధార్ కు ప్రాచుర్యం కల్పించడంలో శంకర్ సక్సెస్ అయ్యారు. జనం స్వచ్ఛందంగా ఆధార్ కోసం దరఖాస్తు చేసుకునేంత అవేర్ నెస్ తెచ్చారు. ఆధార్ తో తన ప్రయాణాన్ని ఆయన ఇలా పంచుకున్నారు..
1. ప్రభుత్వ అధికారుల మైండ్ సెట్ అర్థం చేసుకోవాలి
ప్రభుత్వ అధికారులు చేసిన ప్రతి పనిని మెచ్చుకోవాలి. వారిది లాభాపేక్ష అని ఎప్పుడూ జడ్జ్ చేయొద్దు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ప్రోటోకాల్స్ వగైరా వగైరా అని బోలెడుంటాయి వాళ్లకు. అందుకే బ్యూరోక్రటిక్ గా, నెమ్మదిగా పనులు చేసుకుపోతుంటారు. పైగా ప్రతీ పనికి జవాబుదారీగా ఉండాలి. మనలా రిస్కు తీసుకుంటే వారికి బోనస్ కూడా రాదు.
2. ఇంప్లిమెంటేషన్ సింపుల్ గా ఉండాలి
ఏదైనా సమస్యకు పరిష్కారం వెతికితే, అది ప్రభుత్వం అమలు చేసేంత సింపుల్ గా ఉండాలి. భారత ప్రజల మధ్య వైవిధ్యం, మైండ్ సెట్, జనం సమస్యలు- ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. భారత గ్రామాల్లోని వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న తర్వాతే మేం ఆధార్ కార్డు రూపొందించాం.
3. సింపుల్ సొల్యూషన్ అయితే బెటర్
ఏ సమస్యకైనా సొల్యూషన్ కూడా సింపుల్ గా ఉండటం ముఖ్యం. ఉదాహరణకు ఆధార్ నే తీసుకుంటే.. ప్రతీ మనిషికి ఒక విశిష్ట గుర్తింపు కార్డు ఉండాలన్నదే దాని ఏకైక ఉద్దేశం. అంతే. అంతకుమించి పెద్దగా ఏమీ లేదు. ఇందులో ప్రభుత్వంతోపాటు ప్రైవేటు సంస్థలు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. దట్ ఈజ్ బ్యూటీ ఆఫ్ సొల్యూషన్!
4. బోలెడంత ఓపిక అవసరం
ఆధార్ మోడల్ గురించి ప్రభుత్వాన్ని కన్విన్స్ చేయడానికి మేం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆధార్ కార్డుకు గ్రీన్ సిగ్నల్ రావడానికి చాలా సమయమే పట్టింది. అప్పటిదాకా మేం చాలా ఓపిగ్గా పనిచేయబట్టే అనుకున్నది సాధించాం అంటారాయన.
2012 ఫిబ్రవరిలో శంకర్ ఆధార్ సంస్థ నుంచి బయటికొచ్చారు. ఈమధ్యే మళ్లీ నీలేకనితో కలిసి ఏక్ స్టెప్ అనే కంపెనీని ప్రారంభించారు. ఇదొక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. 20 కోట్ల మంది చిన్నారులకు సమాన స్థాయిలో ప్రాథమిక విద్య అందించే టెక్నాలజీని ఈ కంపెనీ ద్వారా తయారు చేస్తున్నారు శంకర్.
ఎంజాయ్ ది ఎక్స్ పీరియెన్స్..
అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. ఆంట్రప్రెన్యూర్షిప్ ను చూసే విధానం మారింది. సొసైటీలో ఆంట్రప్రెన్యూర్లపై గౌరవం పెరిగింది. ఇప్పుడొస్తున్న యువ ఆంట్రప్రెన్యూర్లు గుడ్డిగా ఇతరులను ఫాలో కావడం లేదు. సొంత తెలివితేటలతో కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. కోట్లు సంపాదించాలని ఈ రంగంలోకి రావొద్దు. ఈ జర్నీలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించండి! ఆ ఎక్స్ పీరియెన్స్ భలే థ్రిల్లింగ్ గా ఉంటుంది!