కొత్తనోట్ల స్పెషాలిటీ ఏంటో తెలుసా..!?
నకిలీవి తయారుచేయడం ఎవరి జేజమ్మ తరం కూడా కాదట!!
Friday November 11, 2016,
2 min Read
మొత్తానికి పెద్దనోటు చేతికొచ్చింది. నానా తంటాలు పడి జనం పింక్ నోట్లను జేబులో వేసుకున్నారు. వాటితో సెల్ఫీలు దిగి ఫేస్ బుక్ లో కూడా పెట్టారునుకోండి.. అది వేరే విషయం. వాటిని చూసి కొందరు ఎగ్జయిట్ అయ్యారు. పాతదానితో పోల్చి విశ్లేషించారు. కొందరు పెదవి విరిచారు. మరికొందరు బాగుందన్నారు. సరే, ఎవరి అభిప్రాయాలు వాళ్లవి. వాళ్ల సంగతి కాసేప పక్కన పెడితే కొత్తగా వచ్చిన కరెన్సీలో కంటికి కనిపించే ఫీచర్సే కాదు.. కనపడని విశేషాలు కూడా చాలానే ఉన్నాయంటోంది కేంద్రం. ఇకపై నకిలీవి తయారు చేయడానికి ఎవరి జేజమ్మ తరం కాదని కూడా చెప్తోంది. ఇంతకూ కొత్తనోట్లలో ఫీచర్సేంటో తెలుసుకుందామా?
ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నోట్లు అందుబాటులోకి తెచ్చింది. సరికొత్త సెక్యూరిటీ ఫీచర్స్ తో 500, రెండు వేల రూపాయల నోట్లను రిలీజ్ చేసింది. పాత నోట్లతో పోలిస్తే ఈ నోట్ల రంగు, సైజులో పూర్తి భిన్నంగా ఉన్నాయి. పాత 500 నోటు డెమన్షన్ 72x166 మిల్లీమీటర్లు కాగా.. కొత్త నోటు స్టోన్ గ్రే కలర్లో 66X150 మిల్లీమీటర్లుగా ఉంది. ఇక కొత్త రెండు వేల రూపాయల నోటు పింక్ కలర్లో 66X166 మిల్లీమీటర్ల డైమెన్షన్లో ఉంది.
నయా నోట్ల ఫీచర్స్ విషయానికొస్తే.. పింక్ కలర్లో మెరిసిపోతున్న 2000 రూపాయల నోటు మధ్యలో ఎప్పటిలాగే గాంధీ బొమ్మ నవ్వుతూ కనిపిస్తుంది. నోటు ఎడమవైపు కింది భాగాన 2000 సంఖ్య అదృశ్యరూపంలో ఉంటుంది. లైట్ వెలుతురులో మాత్రమే ఇది కనిపిస్తుంది. దాని కింది భాగంలో ఉన్న లేటెంట్ ఇమేజ్ను 45 డిగ్రీల యాంగిల్లో చూస్తే 2000 నెంబర్ కనిపించేలా డిజైన్ చేశారు. నోటు ఎడమవైపునే రూపాయి సింబల్తో పాటు దేవనాగరి లిపిలో 2000 సంఖ్య రాసి ఉంటుంది. అంతేకాకుండా అతి సూక్ష్మరూపంలో ఆర్బీఐ, 2000 నెంబర్ ముద్రించి ఉంటాయి.
ఇక సెక్యూరిటీ థ్రెడ్లో భారత్, ఆర్బీఐ, 2000 సంఖ్య కనిపిస్తున్నాయి. నోటును అటు ఇటూ కదిపినప్పుడు ఇవి గ్రీన్ నుంచి బ్లూ కలర్లోకి ఛేంజ్ అవుతాయి. ఇక కుడివైపున ఆర్బీఐ గవర్నర్ సంతకం, రిజర్వ్ బ్యాంక్ ఎంబ్లమ్, దానిపైన గ్యారెంటీ క్లాజ్ ముద్రించారు. పక్కనే ఉన్న వైట్ స్పేస్లో మహాత్మాగాంధీ బొమ్మతో పాటు 2000 నెంబర్ వాటర్మార్క్ రూపంలో కనిపిస్తుంది. నోటు ఎడమవైపున పైభాగంలో, కుడివైపున కింది భాగంలో ఆరోహణక్రమంలో నెంబర్ ప్యానెల్ ఉంటుంది. కుడివైపు కింది భాగంలో రూపాయి సింబల్తో 2000 డినామినేషన్ లైటింగ్కు అనుగుణంగా గ్రీన్ నుంచి బ్లూ కలర్లో మారుతూ కనిపిస్తుంది. దాని పక్కనే అశోకా పిల్లర్ ఎంబ్లమ్ ముద్రించారు.
ఇక నోటు తిప్పి చూస్తే ప్రింట్ చేసిన సంవత్సరం, స్వచ్ఛ్ భారత్ నినాదంతో పాటు లోగో ఉంటాయి. సెంటర్లో లాంగ్వేజ్ ప్యానెల్, ఆ పక్కనే మంగళ్యాన్ బొమ్మ కనిపిస్తాయి. దేవనాగరి లిపిలో 2000 నెంబర్ ముద్రించి ఉంటుంది. దృష్టి లోపం గల వారు సైతం సులువుగా గుర్తించేలా కొత్త నోట్లకు రూపమిచ్చారు. మహాత్మాగాంధీ బొమ్మ, అశోకా పిల్లర్, బ్లీడ్ లైన్స్, ఐడెంటిఫికేషన్ మార్క్ లు చేతి స్పర్శకు తెలిసేలా కొంచెం ఉబెత్తుగా ఉంటాయి. నోటు కుడివైపున ముద్రించిన 2000 నెంబర్ డినామినేషన్ ను సైతం చేతితో తాకి గుర్తించవచ్చు. నోటుకు కుడి, ఎడమవైపున ఏడేసి బ్లీడింగ్ లైన్స్ ద్వారా అంధులు 2వేల రూపాయల నోటును సులువుగా గుర్తించవచ్చు.
కొత్త ఐదు వందల రూపాయల నోటు విషయానికొస్తే.. స్టోన్ గ్రే కలర్లో ఉన్న ఈ నోటు కూడా దాదాపు 2 వేల రూపాయలకున్న ఫీచర్లే కలిగి ఉంది. అయితే 500 నోట్లుకు రెండు వైపులా 5 చొప్పున మాత్రమే బ్లీడింగ్ లైన్స్ ఉంటాయి. నోటు వెనకభాగంలో దేశ వారసత్వ సంపద అయిన చారిత్రక ఎర్రకోట బొమ్మ కనిపిస్తుంది.