కేరళలో ఐదుగురు కుర్రాళ్ల అద్భుతం
ఇంటికే సరుకులు డెలివరీ చేసే ఈ కామర్స్ ఐదుగురు మిత్రుల ఐడియా అదుర్స్
Wednesday November 25, 2015,
4 min Read
కలలు అందరూ కంటారు. కానీ..వాటిని నిజం చేయడానికి తాపత్రయపడేవాళ్లు.. అందుకు కమిట్మెంట్తో కష్టపడేవాళ్ల సంఖ్య చాలా తక్కువ. వందలో 50శాతంమంది మాత్రమే అలాంటివాళ్లు ఉంటారు. అలాంటి వ్యక్తులే ఈ ఐదుగురు..
అది 2012. ఈ కామర్స్ ఇండస్ట్రీ.. ఇండియాలోని ప్రధాన నగరాల్లో అప్పుడప్పుడే మొదలవుతోంది. ఇక Gods Own Country కేరళలో అయితే వందకు 90మంది ఆ మాటే విని ఉండరు. అలాంటి చోట మూడేళ్ల క్రితం ఒక ఐదుగురు యువకులు పెద్ద సాహసమే చేశారు. టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంలో చాలా స్లోగా మూవ్ అవుతున్న కేరళలో ఆ ఐదుగురు దాని అర్ధాన్ని మార్చేసే ప్రయత్నం చేశారు. త్రివేండ్రంలో ఇంటికే సరుకులు డెలివరీ చేసే ఈ కామర్స్ పోర్టల్ను తయారుచేయడమే కాకుండా.. దాన్ని సక్సెస్ఫుల్గా నడుపుతున్నారు కూడా!
ఐదుగురు మిత్రులు.. ఒక కల.
త్రివేండ్రంలోని శ్రీ చిత్ర తిరునాళ్ ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్స్ ఫైనల్ ఇయర్ పిల్లలంతా చదువు అయిపోగానే టాప్ కంపెనీల్లో జాబ్స్ ఎలా కొట్టాలా అని ప్లాన్ చేస్తున్నారు. కానీ.. కృష్ణప్రసాద్, అనూప్ జి కుమార్, షాన్ ఎం హనీఫ్, షినోజ్ ఎస్, జేనూ జోసెఫ్ అనే ఐదుగురు ఫ్రెండ్స్ మాత్రం కొత్తగా ఏదో చేయాలనే ఆలోచన చేశారు. తాము సంపాదించడమే కాకుండా నలుగురికి ఉపాధి కల్పించాలని సంకల్పించారు. ఆ ఆలోచనలోనుంచి పుట్టిందే నియో లాజిక్స్ సంస్థ. చదువు పూర్తయ్యాక ఇదే కంపెనీ "Kada.in" అనే పోర్టల్ని లాంచ్ చేసింది.
ఈ పోర్టల్ లాంచ్ చేయడం వెనుక కూడా ఒక కథ ఉంది. త్రివేండ్రం టెక్నోపార్క్ ఏరియాలో నియోలాజిక్స్ సంస్థ ఏర్పాటుచేసినప్పుడు అక్కడుండే సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు షాపింగ్ చేయడానికి టైమ్ దొరికేది కాదు.దీన్ని గమనించే.. ఈ పోర్టల్ లాంచ్ చేయాలనే ఐడియా వచ్చిందంటారు ఇందులో ఒక పార్ట్నర్ అయిన షాన్.
టెక్నోపార్క్లో తమ ఆఫీస్లో పనిచేసే కొలీగ్స్, తెలిసిన వాళ్లే ఈ Portalలో మొదట కస్టమర్లు. అదే ఏరియాలో ఉండే తమ తల్లిదండ్రుల కోసం చాలామంది ఎన్నారైలు కడా పోర్టల్ ద్వారానే సరుకులు బుక్చేసి.. ఆన్లైన్లో చెల్లిస్తారు. నెలకు రూ.1 నుంచి 3లక్షల వరకూ బిజినెస్ రావడానికి ఏడాది కష్టపడాల్సి వచ్చింది. ఇవాళ్టికి రూ. కోటి పాతిక లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెడితే.. రూ.15లక్షల ఆదాయం వస్తోంది. అందులో 15 నుంచి 20శాతం వరకూ యాప్ నుంచి వస్తుంటే.. దాదాపు 2500 ఆర్డర్లు డెలివరీ చేయగలుగుతున్నారు. ప్రస్తుతానికి Kada.inలో 50మంది ఉద్యోగులతో పాటు పార్ట్టైంలో పనిచేసే వాళ్లూ ఉన్నారు. కస్టమర్ల అవసరం మేరకు ఆఫీసులకు, ఇళ్లకు సరుకులు డెలివరీ చేస్తున్నారు.
కేరళలోని ప్రధాన నగరాల్లో తమ బిజినెస్ను విస్తరించాలని ప్లాన్ చేస్తున్న Kada టీమ్, తక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరమయ్యే కొల్లాం, కొచ్చి, త్రిశూర్, కాలీకట్ ప్రాంతాలను మొదటగా ఎంచుకుంది. ఆ తర్వాత 18 నెలల వ్యవథిలో కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా తమ సేవలకు విస్తరించాలని భావిస్తోంది. 2017-18 నాటికి రూ.40కోట్లు రెవెన్యూ సాధించాలని భావిస్తోంది.
మిగతావాళ్లకంటే భిన్నంగా Kada.in సేవలను అందిస్తోంది. వాటిలో కొన్ని..
> కస్టమర్ల దగ్గర కిలో రూ.10కి పాత న్యూస్పేపర్లు తీసుకుని, అందుకు బదులుగా వచ్చిన మొత్తానికి సరుకులు అందిస్తుంది.
> పాత న్యూస్పేపర్లు, పుస్తకాలు, అల్యూమినియం, స్టీల్, కంచు, పాతటీవీలు ఇలా.. ఇంట్లో పనికిరాని ఏ వస్తువునైనా ఒక నిర్ణీత ధరకు కస్టమర్ల దగ్గర తీసుకుని అందుకు బదులుగా కూపన్లను ఇస్తున్నారు. వీటిని వినియోగించి తమ సైట్లో షాపింగ్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నారు. ఇలా సేకరించిన పనికిరాని వాటిని కొన్ని కంపెనీలతో టై అప్ అయి అమ్మేస్తున్నారు.
> సేకరించిన న్యూస్ పేపర్లలో కొంత భాగాన్ని సేవా సంస్థలకు అందించి.. తమ కంపెనీకే అవసరమైన పేపర్ బ్యాగులను తయారు చేయిస్తున్నారు. దీని ద్వారా స్వయం సహాయక బృందాలను ప్రోత్సహించడంతో పాటు.. తమ అవసరాలను తీర్చుకుంటున్నారు.
> Kada.in స్పెషల్స్ పేరుతో మరో కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇంట్లో ఉండే మహిళలను పచ్చళ్లు, ఇతర నిత్యావసరాలు తయారుచేసేలా.. వాటిని తమ పోర్టల్ ద్వారా విక్రయించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అందుకు అవసరమైన బ్రాండింగ్, లైసెన్స్లు లాంటివాటివన్నీ కంపెనీనేయే చూసుకుంటుంది. వీటికి ఫండింగ్ కోసం ఎదురుచూస్తోంది కంపెనీ.
సవాళ్లు
కేరళ మార్కెట్ స్పేస్లో Kadaకు కావాల్సినన్ని సవాళ్లు ఉన్నాయి. మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే కేరళలోని ప్రజలను ఈ-కామర్స్కు అలవాటుచేయడం, సరుకులను ఆన్లైన్లో కొనిపించేలా చేయడం కాస్త కష్టమైన పనే. దీనితో పాటు అక్కడుండే వాతావరణ పరిస్థితుల వల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయంటారు కాడా కంపెనీ డైరక్టర్ అనూప్ జి కుమార్. భద్రపర్చిన కూరగాయలు, పళ్లు ఒకటి రెండ్రోజులకే పాడైపోతున్నాయని, వాటిని ఫ్రెష్గా ఉంచడం కోసం ధర్మల్ ప్రొటెక్షన్ వ్యాన్లను వినియోగిస్తున్నామని చెబుతున్నారు.
దాదాపు అన్ని మెట్రో నగరాల్లో ఆన్లైన్లో సరుకులు బుకింగ్ చేసుకునే సదుపాయం ఉన్నా కూడా ఎవరూ కేరళలో ఎంటర్ అవ్వలేదు. అందుకే.. జనానికి ఈ కాన్సెప్ట్ని అర్ధం అయ్యేలా చేయడంలో ముందడుగు వేసి సక్సెస్ అయ్యామంటారు షాన్. మిగతా జిల్లాల్లోనూ సేవలు అందించాలని విజ్ఞప్తులు వస్తున్నాయని అంటున్నారు. " చిన్నచిన్న పట్టణాల్లో తక్కువ రెవెన్యూ వచ్చినా కూడా.. ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉంటుంది. బ్రాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది" అంటారు షాన్. ప్రస్తుతం ఇన్వెస్టర్ల కోసం ఎదురుచూస్తోంది Kada.in.
ఆన్లైన్ ఫుడ్, గ్రోసరీ మార్కెట్ రూ.2,541,205 కోట్లు ఉంటుందని తాజా సర్వేలు తేల్చేశాయి. చాలా కంపెనీలు ఈ మార్కెట్లోకి ఎంటరయినా కూడా నిలువలేక పోయాయి. ప్రధాన పోటీదారులు BigBasket, Zopnow, Peppertap, Grofers, LocalBanya and Jugnoo లాంటి కంపెనీలు ఈ ఒక్క ఏడాదే దాదాపు రూ.800 కోట్లు పెట్టుబడులు రాబట్టుకోగలిగాయి.Ola, Flipkart, and Amazon లాంటి పెద్ద కంపెనీలు కూడా ఈ మార్కెట్లోకి వస్తున్న తరుణంలో.. కొత్తగా వచ్చే స్టార్టప్స్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుతానికి కాడా ఒక్కటే కేరళలో ఈ సర్వీసులు అందిస్తున్నా.. రాబోయే కాలంలో బిగ్ ప్లేయర్స్ ఈ మార్కోట్లోకి ఎంటరవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఈ రంగంలో ఉండే అవకాశాలు ఎంతమందికైనా చోటు కల్పిస్తాయని భరోసాగా చెబుతున్నారు నిపుణులు.