ఆటలతో పిల్లలకు విజ్ఞానాన్ని అందిస్తున్న అంజన

గుర్గావ్‌లో ‘చిల్డ్రన్ మ్యూజియం‘లను ఏర్పాటు చేసిన అంజనా మీనన్మ్యూజియంలో ప్రయోగాత్మక పద్ధతులను పిల్లలకు నేర్పిస్తున్న అంజనాగుర్గావ్ మ్యూజియంలో ఏడు రకాల గ్యాలరీలుఆడుకుంటూనే అవసరమైన నైపుణ్యాన్ని అలవర్చుకుంటున్న చిన్నారులుదేశవ్యాప్తంగా మ్యూజియాలను విస్తరించాలనే యోచన

 ఆటలతో పిల్లలకు విజ్ఞానాన్ని అందిస్తున్న అంజన

Thursday July 09, 2015,

5 min Read

'ఇప్పటి పిల్లలు ఆడుకోవడమే మర్చిపోయారు. ఎప్పడు చూసినా వీడియోగేమ్సే'. ఈ మధ్య ఓ యాడ్‌లో వినిపించే మాట. తమ చుట్టూ అందమైన ప్రపంచం ఉందన్న విషయమే వారికి తెలియడం లేదు. అయితే మొబైల్‌ ఫోన్స్ లేదంటే, టీవీల్లో కిడ్స్ ప్రోగ్రామ్స్. ఓ వైపు ప్రపంచం మొత్తం సాంకేతిక విప్లవం ఎగిసిపడుతుంటే.. దానికి పిల్లలూ బానిసలవుతున్నారు. అలాంటి పరిస్థితుల నుంచి పిల్లలను బయటకు తీసుకొచ్చేందుకు వినూత్నంగా ఆలోచించారు అంజనా మీనన్. ఢిల్లీలో వైవిధ్యభరితమైన మ్యూజియాలను ఏర్పాటు చేసి, ప్రయోగాల ద్వారా పిల్లలకు విజ్ఞాన్నాన్ని అందిస్తున్నారు.

‘‘జ్ఞానాన్ని స‌ముపార్జించ‌డానికి నిజ‌మైన ప‌ద్ధ‌తి ప్ర‌యోగాలే’’. తమ చుట్టుపక్కల ఉన్న ప్రపంచంతో ప్రయోగాలు చేస్తూ, పరిచయం పెంచుకునే చిన్నారులే త్వరగా, చక్కగా నేర్చుకోగలుగుతారు. దీన్నే బలంగా నమ్ముతారు అంజనా మీనన్. ఈ నమ్మకంతోనే 2012లో గుర్గావ్‌లో ‘పిల్లల నక్షత్రశాల‘ను ఏర్పాటు చేశారు.

అంజనా మీనన్

అంజనా మీనన్


ఇంజినీర్ అయిన అంజన ప్రొగ్రామర్‌గా ఎన్నో ఏళ్ల పాటు అమెరికాలో పనిచేశారు. పిల్లలు పుట్టిన తర్వాత వారికి ప్రపంచాన్ని పరిచయం చేసేందుకు సైన్స్ మ్యూజియం, చిల్డ్రన్స్ మ్యూజియాలకు తీసుకెళ్లేవారు. (అమెరికాలో 300కు పైగా మ్యూజియంలున్నాయి). భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత అలాంటి మ్యూజియాలు లేకపోవడం ఆమెను ఆశ్చర్యపరిచింది. ‘వారంతాల్లో పిల్లలను కేవలం సినిమాలకు, వీడియో ఆర్కేడ్‌లకు మాత్రమే తల్లిదండ్రులు తీసుకెళ్లడం విచారకం’ అని అంజన అంటారు. దీంతో 2012లో రెండు నుంచి పదేళ్ల వయసు పిల్లల కోసం ఇంటరాక్టివ్ మ్యూజియంను ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో పని ప్రారంభించారామె.

ఆ మ్యూజియం 2012 నవంబర్‌లో ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రతి నెలా 6500 మంది చిన్నారులు ఈ మ్యూజియాన్ని సందర్శిస్తున్నారు. గుర్గావ్‌లోని అంబియన్స్ మాల్‌లో 11 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏడు గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఇందులో థియేటర్‌తోపాటు కేఫ్‌లు కూడా ఉన్నాయి.

పిల్లల భవిష్యత్ కోసం తపించిపోతున్న అంజనతో యువర్‌స్టోరీ మాట్లాడారు. ఆమె కలలు, ప్రాజెక్ట్ విజన్‌పై వివరాలు తెలిపారు.

యువర్‌స్టోరీ: చిల్డ్రన్స్ మ్యూజియం..? భారత్‌లో ఈ ఐడియా చాలా కొత్తగా ఉంది. ఇలాంటి దాన్ని ప్రారంభించాలని ఎందుకనుకున్నారు?

అంజన: మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు, మేం అమెరికాలో ఉన్న సమయంలో తరచుగా మ్యూజియంలకు వెళ్లేవారం. ఆ ట్రిప్‌లను మా పిల్లలు ఎంతో ఎంజాయ్ చేసేవారు. బ్లాక్స్‌తో ఆడుకోవడం, రోల్ ప్లేయింగ్ వంటి వాటితో పిల్లలకు ఎన్నో వివరాలు తెలుస్తాయని నాకు అనిపించింది. చిన్నపిల్లలు కలర్స్, షేప్స్‌ను, కాస్త పెద్దవారు, అత్యంత సంక్లిష్టమైన గ్రావిటీ, ఆయస్కాంతత్వం వంటి వాటి గురించి తెలుసుకుంటారు. వీటితోపాటు ఆడుకుంటూ ఎంతో ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి వాటి కోసమే పిల్లలు చూస్తూ ఉంటారు. మేం ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత, యంగ్ చిల్డ్రన్ కోసం ఇలాంటి మ్యూజియాలు ఎక్కడా కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అందుకే నేనే ప్రారంభించాలనుకున్నాను. పిల్లలు స్వేచ్ఛగా అడుకునేందుకు , బ్రిడ్జ్‌లు నిర్మించేందుకు తమ చుట్టు పక్కల ఉన్నవాటిని ఆస్వాదించేటటువంటి ప్రదేశాన్ని నిర్మించాలనుకున్నాను.

యువర్‌స్టోరీ: మీ మ్యూజియం థీమ్ ఏంటి? దాని ద్వారా పిల్లలు ఎలా నేర్చుకుంటారు?

అంజన: సైన్స్, జాగ్రఫీ, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, అడ్వెంచర్, కమ్యూనిటీ లివింగ్ వంటి విభాగాలతో కూడిన ఏడు వైవిధ్య భరితమైన గ్యాలరీలున్నాయి. పిల్లలు ఇక్కడికి వచ్చి ఆడుకుంటూ నేర్చుకోవాలన్నదే మా ఐడియా. ఈ మ్యూజియంలో ఇద్దరు ఎడ్యుకేటర్స్ ఉన్నారు. అలాగే ఒక్కో గ్యాలరీకి ఒక్కో సూపర్‌వైజర్. పరిస్థితులను అర్థం చేసుకోవడంలో పిల్లలు కన్ఫ్యూజన్‌కు లోనైతే వారికి ఈ సూపర్‌వైజర్లు సాయం చేస్తారు. ఇందులోని కొన్ని కాన్సప్ట్స్ చాలా సులభంగా ఉంటాయి. కమ్యూనిటీ లివింగ్ కాన్సెప్ట్‌లో చిన్నారులు ఇతరులతో కలిసి ఆడుకుంటూ సమస్యల పరిష్కారం, రీజనింగ్ వంటి నైపుణ్యాలను నేర్చుకుంటారు.


పిల్లలు ఆడుకునేందుకు రూపొందించిన పరికరాలు

పిల్లలు ఆడుకునేందుకు రూపొందించిన పరికరాలు


యువర్‌స్టోరీ: ఏ వయసు గల చిన్నారులను ఉద్దేశించి ఈ మ్యూజియం ఏర్పాటు చేశారు? మ్యూజియం డిజైన్, కంటెంట్‌ను ఎలా నిర్ణయించారు?

అంజన: రెండు నుంచి 10 ఏళ్ల వయసులోపు పిల్లల కోసమే ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. వారు మ్యూజియానికి రావడం ద్వారా ఎన్నో విషయాలను ఎడ్యుకేటర్లు ద్వారా తెలుసుకుంటారు. టీచింగ్‌లో కొత్త కొత్త ఆవిష్కరణలు, లెర్నింగ్ కిడ్స్‌పై మా ఎడ్యుకేటర్లకు ఎంతో అనుభవముంది. ఈ రంగంలో 25 ఏళ్లకు పైగా అనుభవమున్న షికాగో నిపుణులతో మ్యూజియం డిజైన్ చేయించాం. ఇందుకు ఆరునెలల సమయం పట్టింది. వివిధ గ్యాలరీల ధీమ్స్, కంటెంట్లను రూపొందించేటప్పుడు డిజైనర్లతోపాటు ఎడ్యుకేటర్లను కూడా ఇన్వాల్వ్ చేశాము. వివిధ స్కూల్ మేనేజ్‌మెంట్లతో చర్చలు జరిపి స్కూల్ ట్రిప్‌లను కూడా ఏర్పాటు చేశాం. దీంతో చాలా స్కూల్స్ తమ పిల్లలను ఈ మ్యూజియాలకు పంపుతున్నాయి.

యువర్‌స్టోరీ: సంస్థకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి. భవిష్యత్ విస్తరణ ప్రణాళికలేంటి?

అంజన: నోయిడాలోని స్టెల్లార్ గ్రూప్ రియల్ ఎస్టెట్ కంపెనీ ఇందులో పెట్టుబడులు పెట్టింది. డెటాల్‌ లాంటి కార్పొరేట్ సంస్థల నుంచి కూడా నిధులు వచ్చాయి. హర్పార్ కొలిన్స్, ట్రావెలర్ కిడ్స్, ఫ్రాంక్ టాయ్స్ వంటి కార్పొరేట్ సంస్థలు కూడా వివిధ రకాలుగా స్పాన్సర్ చేస్తున్నాయి. పిల్లల పుస్తకాలు, డీఐవై కిట్స్ వంటి చిన్నపిల్లల ప్రాడక్ట్స్‌లను అందజేస్తున్నాయి. ఇది ప్రయివేట్ వెంచర్ కావడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఆశించలేదు. అలాగే సంస్థను విస్తరించాలనుకుంటున్నాం. ఢిల్లీలో మరో మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నాం. దేశంలోని ఇతర నగరాల్లో కూడా ఇలాంటి మ్యూజియాలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చేవారికి ఫ్రాంచైజీలు ఇస్తాం. అయితే ఈ విషయంలో మేం ఆచితూచి వ్యవహరిస్తాం. ఆసక్తి కనబర్చే వ్యక్తులకు కూడా మాలాగే ఈ రంగంపై ఎంతో మక్కువ కలిగి ఉండాలి. ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేసి కొద్దికాలమే అయింది. కాబట్టి దేశవ్యాప్తంగా ఈ ఐడియా చాలా కొత్తది.

యువర్‌స్టోరీ: మ్యూజియం టైమింగ్స్, ఫీజు వివరాలు ఏంటి ?

అంజన: వారమంతా ఉదయం పది నుంచి రాత్రి ఎనిమిది వరకు మ్యూజియం తెరిచే ఉంటుంది. మెంబర్షిప్ పథకం ఉంది. మెంబర్లుగా చేరినవారికి డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం 140 మంది సభ్యులున్నారు. అలాగే స్కూల్ విద్యార్థులకు రెండు గంటల పాటు ట్రిప్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇక మ్యూజియంలో కనీసం 30 నిమిషాలుంటే రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. వారు అంతకుమించి సమయం అందులో గడిపితే అదనంగా మరింత చెల్లించాలి. ఇక ఏడాదిలోపు పిల్లలకు, 16 ఏళ్లు పైబడిన వారికి ప్రవేశం ఉచితం. బుధవారాల్లో ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లున్నాయి. అలాగే బర్త్ డేలు, ఇతర ఈవెంట్స్‌కు ప్రత్యేక ప్యాకేజీలున్నాయి.

మ్యూజియంలో పిల్లల కోసం ఏర్పాటు చేసిన  ఆట వస్తువులు

మ్యూజియంలో పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆట వస్తువులు


యువర్‌స్టోరీ: మిమ్మల్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? అలాగే పని, కుటుంబాన్ని ఎలా సమన్వయం చేసుకుంటున్నారు?

అంజన: ఈ రంగంపై నాకున్న మక్కువే నన్ను నడిపిస్తోంది. ఇలాంటి మ్యూజియాలు భారత్‌లో అవసరమని తల్లిగా నా విశ్వాసం. సాంకేతికతకు దూరంగా ఉండేలా ఈ మ్యూజియంలో ఏర్పాట్లు చేశాం. ప్రతి ఒక్కటీ ప్రయోగాత్మకంగా నేర్చుకునేలా ఏర్పాట్లు చేశాం. అలాగే ఈ మ్యూజియాన్ని పూర్తిగా వ్యాపారాత్మకంగా చూడటం లేదు. నా వరకైతే ఇది నా స్వప్నం. దీన్ని మరింత పెద్దది చేయాలని కలలు కంటున్నాను. పిల్లలు నేర్చుకునేందుకు, ఎంజాయ్ చేసేందుకు ఇలాంటి మ్యూజియాలు రావాలన్నదే నా కల. తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెలుసుకునేందుకు పిల్లలు మరింత ఉత్సాహవంతంగా పనిచేయాలన్నదే నా లక్ష్యం. నేను ప్రతిరోజు నోయిడా నుంచి గుర్గావ్‌కు ప్రయాణిస్తూ ఉంటాను. ఏదైనా రంగంపై మనకు అమితమైన ఇష్టముంటే.. పరిస్థితులు వాటంతటవే చక్కబడుతాయని నా గట్టి నమ్మకం. మా అత్తగారి ఇంట్లో నాకు మంచి మద్దతు లభిస్తున్నది. మ్యూజియానికి సంబంధించిన అన్ని రకాల ఆర్థిక వ్యవహారాలను నా భర్త అక్షయే చూసుకుంటారు.

యువర్‌స్టోరీ: వ్యవస్థాపక రంగంలోకి అడుగుపెట్టాలనుకుంటున్న వర్థమాన వ్యాపారవేత్తలకు మీరిచ్చే సలహా ఏమిటి? ముఖ్యంగా మహిళలకు?

అంజన: జీవితంలో రిస్క్ తీసుకోవడమంటే నాకు ఇష్టం. నా భర్త కూడా అలాంటి వారే. మనమీద మనకు నమ్మకం, పనిచేయాలనుకునే రంగంపై ఆసక్తి, కుటుంబ మద్దతు ఉంటే.. ఆలస్యం చేయొద్దు.. వెంటనే రంగంలోకి దూకేయండి. ఆ తర్వాత అన్నీ మీ వెంటే పయనిస్తాయి. మీ ఆలోచన అంత పెద్దది కాకపోవచ్చు. కానీ మీకు దానిపై చక్కటి ఆసక్తి ఉండొచ్చు. వ్యాపారం సైజ్ ఎలాంటిదైనా కానివ్వండి.. పట్టించుకోనవసరం లేదు. అది చిన్నపిల్లలలాంటిది. ఎంత పెట్టుబడి పెడితే అంత పెద్దగా పెరుగుతుంది. మంచి పనులు ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. భారత్‌లో ఇప్పుడు అపార అవకాశాలున్నాయి. ప్రజలకు కొత్త కొత్త ఐడియాలంటే ఎంతో ఇష్టం. మీకు అలా కొత్త ఐడియా ఏదైనా వస్తే.. ఇంకా ఏదీ ఆలోచించాల్సిన అవసరం లేదు. వెంటనే రంగంలోకి దూకేయండి. మిగతావన్నీ అవే చక్కబడుతాయి. మీకు కావాల్సిందల్లా ఆరంభంలో ప్రోత్సాహం మాత్రమే. ఒక్కసారి రంగంలోకి దిగారా.. ఆకాశమే హద్దు.. అని వివరించారు అంజన