ఇంటికన్నా సువిటాస్ పదిలం..!

హైదరాబాద్‌లో వెలిసిన మొట్టమొదటి పోస్ట్ హాస్పిటల్ రిహాబిలిటేషన్ సెంటర్..దేశంలోనే మొదటిది అంటున్న సువిటాస్..

ఇంటికన్నా సువిటాస్ పదిలం..!

Wednesday June 10, 2015,

4 min Read


అనారోగ్యం. వయసుతో సంబంధం లేకుండా ఎవరికి ఏ చిన్న అరోగ్య సమస్య వచ్చినా ఇబ్బందే. అదే హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, క్యాన్సర్, ఆర్థోపెడిక్ వంటి తీవ్ర జబ్బుల బారిన పడితే ఇక చెప్పేదేముంటి ? ఆ కుటుంబం ఆర్థికంగానే కాకుండా మానసికంగా కూడా కుంగిపోతుంది. ఆస్పత్రిలో డయాగ్నోసిస్ చేయడం, అందుకు అవసరమైన చికిత్స తీసుకోవడం ఒక ఎత్తైతే.. ఏదైనా సర్జరీ జరిగిన తర్వాతో, లేకపోతే తీవ్ర అనారోగ్యం పాలైన తర్వాత పడే వేదనే ఎక్కువ. కానీ మన దేశంలో ఇంతకాలం పోస్ట్ హాస్పిటలైజేషన్ రిహేబిలిటేషన్ వ్యవస్థేదీ లేకపోవడం కూడా కుటుంబ సభ్యులను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేది.

హైదరాబాద్‌కు చెందిన సువిటాస్ సంస్థ ఇప్పుడా లోటును భర్తీ చేసేందుకు దేశంలోనే మొదటిసారిగా పోస్ట్ హాస్పిటల్ రీహాబిలేటేషన్ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. సాధారణంగా న్యూరాలజీ, కార్డియాలజీ, మొదటి దశ క్యాన్సర్‌ను గుర్తించిన సమయంలో పేషెంట్లు పడే మానసిక వేదనను మాటల్లో చెప్పలేం. ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పూర్తైన తర్వాత వాళ్లు నేరుగా ఇంటికి వెళ్లడం తప్ప గత్యంతర లేని పరిస్థితి. హాస్పిటల్లో ఎక్కువ కాలం ఉండలేక.. ఇంట్లో కోలుకునే వాతావరణం లేకపోయినా వెళ్లాల్సి ఉంటుంది. ఆ అతి చిన్న గ్యాప్‌ను మేం పూరిస్తామని భరోసా ఇస్తోంది సువిటాస్.

సువిటాస్ సెంటర్‌లో ప్రైవేట్ రూం ఫెసిలిటీ

సువిటాస్ సెంటర్‌లో ప్రైవేట్ రూం ఫెసిలిటీ


టీమ్

ఐటి సహా వివిధ రంగాల్లో రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న ఫ్లయిట్ లెఫ్టినెంట్ బిపిన్ చంద్ర ఈ సంస్థకు నాయకత్వం వహిస్తున్నారు. మెడ్విన్ ఫౌండర్, 22 ఏళ్ల వైద్య రంగ అనుభవం ఉన్న డా. రమేష్, వెంచర్ ఈస్ట్ ఫండ్ మేనేజింగ్ పార్ట్‌నర్‌ సతీష్ ఆండ్ర బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు.

బిపిన్ చంద్ర, డాక్టర్ రమేష్, సతీష్ ఆండ్ర

బిపిన్ చంద్ర, డాక్టర్ రమేష్, సతీష్ ఆండ్ర


ఏంటి ప్రత్యేకత ?

సువిటాస్.. ఆస్పత్రి కాదు. ఇది కేవలం రిహాబిలిటేషన్ వ్యవస్థ మాత్రమే. అంటే ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లేముందు ఇక్కడ వీళ్ల ప్రత్యేక వైద్య సేవలు అందిస్తారు. అనారోగ్యాన్ని బట్టి కొంత మందికి నర్సింగ్ కేర్, ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, సైకాలజీ అవసరముంటుంది. ఆ సేవలన్నింటినీ ఒకే చోట నిపుణులైన బృందం పేషెంట్లకు అందిస్తుంది. నిత్యం డాక్టర్ అందుబాటులో ఉండే ఈ సెంటర్ వాతావరణం కూడా ఇంటిలానే డిజైన్ చేశారు. ఎక్కడా ఆస్పత్రిలో ఉన్నాం అనే భావన రాకుండా జాగ్రత్త పడినట్టు మెడికల్ డైరెక్టర్ డా. విజయ్ చెబ్తారు.

ఎవరి కోసం ?

సువిటాస్ చేసిన ఓ సర్వేలో వాళ్లు తెలుసుకున్న విషయం ఏంటంటే.. పేషెంట్లలో నలభై శాతం మంది మెరుగైన వైద్యం కోసం కనీసం 100 కిమీ వరకూ ప్రయాణిస్తారు. అలాంటి వాళ్ల కోసమే కాదు విదేశాల్లో ఉంటున్న ఎన్ఆర్ఐల తల్లిదండ్రులు, ఇతర ప్రాంతాల వాళ్లు, వర్కింగ్ కపుల్‌కు తమ సేవలు ఎక్కువగా ఉపయోగపడ్తాయని సువిటాస్ టీమ్ చెబ్తోంది. 'న్యూరాలజీ సమస్యలతో (బ్రెయిన్ ఇంజురి, బ్రెయిన్ స్ట్రోక్) బాధపడ్తున్న వాళ్లను చూసుకునేందుకు ఒక మనిషి నిత్యం తోడు ఉండాల్సిందే. అంతేకాదు వాళ్లు త్వరగా కోలుకోవడానికి ఎక్స్‌పర్ట్స్ సాయం చాలా అవసరం. ఎంతకాలం ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నా వాళ్లు మెరుగుకాలేకపోవచ్చు. అలా అని వాళ్లను నెలల తరబడి ఉంచుకునేందుకు ఆస్పత్రులు కూడా మొగ్గుచూపవు. అలాంటి వాళ్లకు మా రిహాబిలిటేషన్ సేవలు అత్యవసరమనిపిస్తాయి' అంటారు డాక్టర్ విజయ్.

కార్డియాక్ సర్జరీ పూర్తైన తర్వాత ఇప్పుడు ఆస్పత్రులు కూడా ఒకటి రెండు రోజులకు మించి ఆస్పత్రుల్లో ఉంచడం లేదు. అలా అని పేషెంట్ల కుటుంబ సభ్యులు ధైర్యంగా ఇంటికి తీసుకువెళ్లలేరు. లోపల ఏదో ఆందోళన ఉన్నా గత్యంతరం లేదు కాబట్టి అడ్జస్ట్ అయిపోయారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. హాస్పిటల్స్‌ వాతావరణంలో ఎక్కువ కాలం ఉన్నా కూడా బ్యాక్టీరియా సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంటుంది. అందుకే విదేశాల్లో అయితే ఆస్పత్రి తర్వాత కొంతకాలం ఇలాంటి సెంటర్లలో చేరి పూర్తి స్వస్థత వచ్చిన తర్వాతే ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ పేషెంట్లకు రెగ్యులర్ కౌన్సిలింగ్‌‌తో పాటు డైట్ ప్లాన్ కూడా పక్కాగా ఫాలో అవుతున్నారు. రిలాక్స్ అయ్యేందుకు యాక్టివిటీ రూమ్, హోం థియేటర్, గ్రూప్ థెరపీ వంటివి కూడా ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన సేవలు అందించడంతో పాటు పేషెంట్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తమ తరపు వాళ్లు ఆన్‌లైన్‌లోనే తెలుసుకునే వీలుంటుంది. వీడియో చాటింగ్ సౌకర్యాన్నీ కల్పిస్తున్నారు.

image


మార్కెట్ అంతుంటుందా ?

"దేశంలో తమదే మొట్టమొదటి పోస్ట్ హాస్పిటల్ రీహాబిలిటేషన్ సెంటర్. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో ఇలాంటి సేవలు ఎప్పటి నుంచో ఆదరణ పొందుతున్నాయి. ఇతర దేశాల్లో ఇన్సూరెన్స్ సంస్థలు కూడా రీహాబిలిటేషన్‌ సేవలకు బీమా సౌకర్యం కల్పిస్తున్నాయి. మన దేశంలో ఇప్పటి వరకూ ఆ అవసరం ఉన్నప్పటికీ ఎవరూ గుర్తించలేకపోయారు. ఆ గ్యాప్‌ను మేం పూర్తిచేసే ప్రయత్నం చేస్తామంటున్నారు'' సువిటాస్ ఎండి బిపిన్ చంద్ర చెబ్తున్నారు.

కంపెనీ డైరెక్టర్ సతీష్ ఆండ్ర విశ్లేషణ ప్రకారం రెండు, మూడేళ్లో ఈ తరహా సేవల మార్కెట్ సైజ్ ఎంత లేదన్నా కనీసం బిలియన్ డాలర్ల వరకూ ఉంటుంది.

ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రారంభమయ్యే కేంద్రంలో 60 బెడ్స్‌ను ఏర్పాటు చేశారు. 20 మంది సిబ్బందిలో మేనేజ్‌మెంట్‌తో పాటు నర్సింగ్, ఫిజియో వంటి నిపుణుల బృందం ఉంది. ఆరు నెలల్లో మరో సెంటర్‌ను కూడా ఏర్పాటు చేసేందుకు మేనేజ్‌మెంట్ బృందం కసరత్తు చేస్తోంది.

సువిటాస్ టీమ్

సువిటాస్ టీమ్


భవిష్యత్ లక్ష్యాలు

ఇలాంటి కాన్సెప్ట్‌ దేశంలోనే కొత్త కావడంతో సువిటాస్‌ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. డాక్టర్లు, ఆస్పత్రులతో అవగాహన కుదుర్చుకోవడంతో పాటు సోషల్ మీడియాను ఎక్కువగా నమ్ముకుంది. త్వరలో బెంగళూరు, ముంబై సహా వివిధ మెట్రో నగరాల్లో ఈ తరహా సేవలను విస్తరించాలని చూస్తున్నారు. మూడేళ్లలో కనీసం వెయ్యి పడకల స్థాయికి సువిటాస్‌ను విస్తరించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఒక్కో మెట్రో నగరానికి కనీసం రెండు సెంటర్లు ఉండేలా ప్రణాళికలు సిద్ధంచేసుకుంటున్నారు. డైరెక్టర్ సతీష్ ఆండ్ర లెక్కల ప్రకారం ట్రాన్సిషన్ కేర్ కేంద్రాల్లో ఒక్కో బెడ్‌ ఏర్పాటుకు కనీసం రూ.5 లక్షల వరకూ ఖర్చవుతుంది. అందుకే రాబోయే మూడేళ్లలో కనీసం రూ. 130-150 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టాలనేది సువిటాస్ ఆలోచన.

website