జాలికాదు... జాడ చూపించండి !

పోలియో కబళించినప్పుడు ఆమె ఒక నిస్సహాయ చిన్నారి. విపరీతమైన అనారోగ్యం ఆమె శరీరాన్ని మెడ నుంచి కింది వరకూ పక్షవాతానికి గురిచేసింది. రెండేళ్లపాటు ఇచ్చిన కరెంట్ షాక్ ట్రీట్ మెంట్ ఆమెకు కొంత బలం చేకూర్చినా ... అది కేవలం శరీర పైభాగానికే. ఆ తర్వాత 15 ఏళ్లు ఒక ఆపరేషన్ తర్వాత మరొకటి ఇలా గడిచిపోయాయి. తల్లిదండ్రులు, వైద్యులు, స్నేహితులు అందరూ నిరాశ నిస్ప్రహల్లోకి వెళ్లినా ... ఆమె మాత్రం ఎంతో మనో ధైర్యంతో పోరాడుతూనే ఉంది.

జాలికాదు... జాడ చూపించండి !

Thursday March 26, 2015,

4 min Read

అలా ఒకప్పుడు వీల్ చైర్‌కే పరిమితమైన మాలతి ... ఆ తర్వాత పద్మశ్రీ డాక్టర్ మాలతి కే హొల్లాగా, అర్జున అవార్డుతో పాటు మరో 400 మెడల్స్‌ను అందుకుని ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆమె భారతదేశంలోని అంగవైకల్యంలో బాధపడ్తున్న చిన్నారులకు బెంగళూరులో మాత్రూ ఫౌండేషన్ పేరిట ఒక ఆశ్రయాన్ని కల్పించారు.

యువర్ స్టోరీ వాళ్ల మీడియా ల్యాబ్‌లో 'భారత ఆర్థిక సమ్మిళిత సదస్సు' జరుగుతున్నప్పుడు డాక్టర్ మాలతి కే హొల్లా చెప్పిన మాటలు ఆ పరిసరాలను, అక్కడున్న అందరినీ మంత్రముగ్థుల్ని చేశాయి. ఆమె ఏమన్నారంటే ... 

'' నేను శారీరకంగా వికలాంగురాలినైనా ... నేను ఎప్పుడూ అలా భావించలేదు. ఎందుకంటే ఆ ఇబ్బంది కేవలం నా శరీరంలోని ఒక భాగానికే కానీ నా ఆత్మవిశ్వాసానికి కాదు ''
డాక్టర్ మాలతి హొల్లాగా

డాక్టర్ మాలతి హొల్లాగా


క్రీడలే వైద్యంగా ...

కృష్ణమూర్తి, పద్మావతి హొల్లాలు మాలతి తల్లిదండ్రులు. 1959లో వాళ్ల ఏడాది వయసున్న పాపకు పోలియో రావడంతో ఏం చేయాలో వారికి తోచలేదు. నలుగురు పిల్లల్లో మాలతి చిన్నది. ఇల్లు గడవడానికి కృష్ణ

మూర్తి బెంగళూరు మారుమూల ప్రాంతంలో ఒక చిన్న హోటల్ నడుపుతుండేవారు. పోలియో సోకిన తొలి రెండేళ్లపాటు మాలతికి కరెంట్ షాక్ ట్రీట్ మెంట్ ఇప్పించారు. అది ఆమె నడుం నుంచి పైభాగానికి కొంతమేర బలం ఇవ్వగలిగింది. దీంతో గుండెను బరువు చేసుకుని మాలతిని చెన్నైలోని ఈశ్వరీ ప్రసాద్ దత్తాత్రేయ ఆర్థోపెడిక్ సెంటర్లో చేర్పించారు. అక్కడ ఆమె ఏకంగా 15 ఏళ్లపాటు ఉంది. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు సర్జరీలు చేయించుకుంటూ ... శారీరకంగా, మానసికంగా తనకు తాను శక్తిని సంపాదించుకునేందుకు కష్టపడింది. ఆ సమయంలోనే క్రీడలు ఆమె జీవితంలోకి వచ్చాయి. “ఆటలనే వైద్యమే నన్ను నొప్పిని మర్చిపోయేలా చేశాయి” అని ఆమె గుర్తు చేసుకుంటుంటారు.

అది పూర్తిగా వేరే ప్రపంచం. ఆమె పెరిగిన పరిసరాల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక వైకల్యం. నొప్పితో రోదించేవారు, ఏడుపులు, బాధలు, ఆపరేషన్లు, వైద్య చికిత్స... వంటివన్నీ అక్కడ మాములే. “అక్కడ చికిత్సకు వచ్చిన చాలా మంది పిల్లలు నిరుపేద కుటుంబాలకు చెందిన వారే, నిస్సహాయ స్థితిలో తల్లిదండ్రులు వారిని అక్కడే వదిలి వెళ్లిపోయేవారు. ఇక ఆహారం, చదువు, చికిత్స అంతా ఆ సెంటరే చూసుకునేది” అని చెప్పుకొచ్చారు. “మేము బాధను ఓర్చుకునే శక్తిని, మానసిక స్థైర్యాన్ని అలవర్చుకున్నాం. మేము భరించలేని నొప్పిని మిగిల్చే సర్జరీలు చేయించుకునే వాళ్లం, అంతకు మించి నొప్పిగా ఉండే ఫిజియోథెరపీ చేయించుకునే వాళ్లం. అయినా నేను ఎప్పుడూ నిరాశతో వెనతిరగదల్చుకోలేదు“ అంటూ పాత జ్ఞాపకాలను మాలత గుర్తుచేసుకున్నారు.

ఆశ్చర్యం ఏంటంటే.. ఆమె హెల్త్ సెంటర్ నుంచి బయటి సమాజానికి వచ్చిన తర్వాతే బాధ మరింత ఎక్కువైంది. ఇది శరీరానికి వచ్చిన నొప్పి కాదు. సమాజమంతా తనను జాలిగా చూడడాన్ని మాలతి ఏ మాత్రం తట్టుకోలేకపోయింది.

‘బంగారు’ మాలతి

బెంగళూరులోని మహారాణి కాలేజీలో చదువుతున్నప్పుడు కూడా మాలతి క్రీడల్లో శిక్షణ తీసుకోవడం ఆపలేదు. 1975 నుంచి 1981 వరకూ ముంబైకు చెందిన నేషనల్ సొసైటీ ఫర్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ ద హ్యాండీక్యాప్డ్ లో అంగవికలుర కోసం ప్రత్యేకంగా నిర్వహించిన జాతీయ క్రీడల్లో వరుసగా ఎన్నో మెడల్స్ సొంతం చేసుకున్నారు. దీంతో స్పోర్ట్స్ కోటా కింద 1981లో సిండికేట్ బ్యాంకులో క్లర్క్ గా ఉద్యోగం వరించింది. అప్పటి నుంచి ఆమె ఏ పోటీలో పాల్గొన్నా .. బ్యాంకు తరఫున ఆడారు. ఆమె పతకాల వేట షార్ట్ పుట్, డిస్కస్, జావెలిన్, వీల్ చైర్ రేస్, ఆప్ట్సకల్ రేస్ ఇలా అన్నింట్లోనూ సాగేది.

1988లో సియోల్ లో జరిగిన పారా ఒలింపిక్స్ లో ఆమె తొలిసారిగా అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్నారు. ఈ పోటీకి వచ్చిన విదేశీ ఆటగాళ్లందరికీ సొంత కోచ్ లు ఉన్నారు. అధైర్యపడకుండా ఆమె కొంతమంది పేరున్న ఆటగాళ్ల క్యాసెట్లను సంపాదించి, వాటిని చూస్తూ తన ఆటను మెరుగుపర్చుకుంది. ఏకలవ్యుడి శిష్యురాలిగా అన్నీ తానే ఒంటరిగా నేర్చుకుంది. ఒక్క ఏడాదిలోనే ఆమె అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాన్ని చేజిక్కించుకుంది. 1989లో డెన్మార్క్ లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ గేమ్స్ లో ఆమె 200 మీటర్లు, షాట్ పుట్, డిస్కస్, జావెలిన్ త్రోలలో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది.

1996లో అర్జున అవార్డు, 2001లో పద్మశ్రీని కూడా తన ఖాతాలో వేసుకున్నారు. రాజ్యోస్థవ అవార్డు, ఏకలవ్య అవార్డు, దాశర అవార్డు, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్సులోనే ఒక తిరుగులేని వికలాంగ క్రీడాకారిణి అవార్డు, కె.కె.బిర్లా ఫౌండేషన్ అవార్డు, ప్రతిభా రత్న అవార్డును అందుకున్నారు. ఇలా చెప్పుకుంటూపోతే ఆమె అందుకున్న పురస్కారాలకు లెక్కేలేదు. 56 ఏళ్లప్పుడు కూడా వీల్ చైర్లో అత్యంత వేగంగా ఆడే క్రీడాకారిణిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. “ఇప్పటివరకూ నేను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 389 బంగారు, 27 వెండి, 5 రజత పతకాలను అందుకున్నాను’’ అంటూ ఎంతో వినమ్రంగానే చెప్తారు. ఇక్కడ అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ అవార్డుల్లో చాలామటుకు ఆమె అద్దె వీల్ చైర్లో ఆడి గెల్చుకున్నవే. ఇలా ఆమె విజయాలపై రూపొందిన బయోగ్రఫీ, ‘ఏ డిఫరెంట్ స్పిరిట్ ‘, 2009లో విడుదలయ్యింది. శారీరక వైకల్యంతో బాధపడుతున్న వేలాదిమందికి స్ఫూర్తినిస్తోంది.

ఫిజికల్లీ ఛాలెంజ్డ్‌కు చేయూత

‘ప్రస్తుతం నేను ఒక గౌరవప్రదమైన జీవనం సాగిస్తున్నాను, నేను జీవితంలో విజయవంతమయ్యాను, పేరు తెచ్చుకున్నాను. కానీ నాలా అవకాశాలు వచ్చిన వారు అరుదు’ అంటూ మురిసిపోతారు. కానీ ఇక్కడితో నేను ఆగిపోతే ప్రయోజనం లేదు. అందుకే 2002లో శరీర ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్నారులకు బాసటగా ‘మాత్రూ ఫౌండేషన్’ ను ఆమె ప్రారంభించారు.

ఈ విషయం గురించి చాలా రోజుల పాటు తన స్నేహితుడైన తోటి పారా ఒలింపిక్ ఆటగాడు కృష్ణారెడ్డితో చర్చించారు. ఇతర ఆప్త మిత్రులైన క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్, అశ్విని నాచప్ప, ఎం.కే. శ్రీధర్ ఆమెకు సాయం అందించారు.

తొలుత, అంగ వికలాంగ పిల్లలను చదివించాలనుకున్నారు. కానీ ఆ తర్వాత ఒక చారిటబుల్ ట్రస్ట్ గా ఏర్పడి, గ్రామీణ ప్రాంతాల్లో పోలియోతో బాధపడుతున్న చిన్నారులకు అండగా నిలవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. క్రమంగా అటువంటి పిల్లలను చదివించే, వైద్యం చేయించే ఆర్థిక స్థోమత లేని తల్లిదండ్రులకూ బాసట ఉండాలనే బరువైన బాధ్యతను నెత్తికెత్తుకున్నారు. “మేము ఇద్దరు పిల్లలతో మొదలు పెట్టాం. ఇప్పుడు నేను 20మంది పిల్లలకు తల్లిని“ అని మాత్రూ ఫౌండేషన్ చిన్నారుల గురించి ఎంతో గర్వంగా చెప్పారు. ఈ పిల్లలంతా ఎక్కడో ఒక చోట తొలి ఉద్యోగం సంపాదించేంత వరకూ ఆమెతోనే ఉంటారు.

అయితే మాత్రూను నడపడం అంత సులువు కాదు. మార్తల్లీలోని ఒక చిన్న ఇంట్లో ఇది నడుస్తోంది. ఈ ఫౌండేషన్ కు ఇద్దరు శాశ్వత ఉద్యోగులు ఉన్నారు. ఒకరు యశోదమ్మ, వంటావిడ, రెండోది కుమార్, ఆల్ రౌండర్. పిల్లలను స్కూలుకు తీసుకెళ్లడం నుంచి షాపింగ్ తీసుకెళ్లడం వరకూ అన్నీ తానై చేస్తాడు. ఇక వైద్య ఖర్చులను కొంతమంది మంచి మనసున్న డాక్టర్లు భరిస్తుంటారు. “ ఫౌండేషన్లోని ఎక్కువ మంది పిల్లలు పోలియో, సెలబ్రల్ పాల్సీతో బాధపడుతున్నారు. ఇది చాలా కష్టం. మేము ఆసుపత్రి ఖర్చులను భరిస్తుంటాం. ఇక కొందరు డాక్టర్లు సర్జరీల కోసం మా దగ్గర ఏమీ తీసుకోరు “ అని చెప్పారు.

ప్రస్తుతం ఒక దాత ముందుకు వచ్చి ఫౌండేషన్ కోసం సర్జాపూర్లో రెండు ప్లాట్లను దానం చేశారు. ఇప్పుడు అక్కడ పిల్లల కోసం కొత్త ఇల్లు నిర్మిస్తున్నాం. “మాకు ఎవరి జాలి అవసరం లేదు, మాకు కావాల్సిందల్లా మా బలాన్ని, శక్తిని సమర్థించి, అది నిరూపించేందుకు దోహదపడే సమాజం కావాలి“ అని మాలతి అంటారు.