రూ.ఐదు వందలతో పెళ్లి చేసుకున్న ఐఏఎస్!!
పదిమందికీ ఆదర్శంగా నిలవాలని..
Wednesday November 30, 2016,
1 min Read
ఐఏఎస్ పెళ్లి అంటే ఎలా వుంటుంది? వీఐపీలు, బుగ్గకార్ల జోరు, మండపాల సెట్టింగులు, ఇన్విటేషన్ కార్డు నుంచి రిసెప్షన్ దాకా ఆ దర్జాయే వేరు. కానీ అతను మాత్రం అలా ఆలోచించలేదు. పదిమందికీ ఆదర్శవంతంగా ఉండాలని సింపుల్గా రూ. 500 ఖర్చుతో దండలు మార్చుకున్నారు.
మధ్యప్రదేశ్ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి ఆశిష్ వశిష్ట ప్రస్తుతం గోహాడ్లో ఎస్డీఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. వధువు సలోని విజయవాడ ఎస్డీఎంగా పనిచేస్తున్నారు. ముస్సోరి ట్రైనింగ్ పీరియడ్లో వీరు ప్రేమలో పడ్డారు. ఇటీవలే వివాహానికి సంబంధించి పర్మిషన్ ఇవ్వాలంటూ మధ్యప్రదేశ్లోని బింద్ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. దీంతో కోర్టు వారికి నవంబర్ 28న పెళ్లి చేసుకోండని డేట్ ఫిక్స్ చేసింది. ఇరు కుటుంబాల పెద్దలు చట్టపరంగా చేయాల్సిన ఏర్పాట్లు చేసుకొని ఒక్కటయ్యారు. కేవలం రూ. 500తోనే పెళ్లి చేసుకుని పదిమందికీ ఆదర్శంగా నిలిచారు. ఆ ఐదువందలు కూడా కోర్టు ఫీజే. వచ్చిన రిలేటివ్స్ కి సింగిల్ స్వీటు ముక్క కూడా లేదట.
ఆశిష్ ది రాజస్థాన్ కాగా సలోనిది పంజాబ్. ప్రస్తుతం వీరిద్దరూ దంపతులు కావడంతో సలోనికి కూడా మధ్యప్రదేశ్ కేడర్లో పనిచేసే అవకాశం రానుంది. దేశమంతా కరెన్సీ కష్టాల్లో ఉన్న నేపథ్యంలో పెద్ద నోట్ల రద్దుతో కరెన్సీని పొదుపుగా వాడుతూ, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఇలా పెళ్లి చేసుకున్నాం అని వధూవరులు చెప్తున్నారు.
మొన్నామధ్య సూరత్లో దక్ష, భరత్ ఒక జంట ఎలాంటి హడావిడి లేకుండా కేవలం రూ. 500 ఖర్చుతోనే పెళ్లి చేసుకున్నారు. వచ్చిన అతిథులకు జస్ట్ కప్పు టీ ఇచ్చి దండం పెట్టారు. దానికి కారణం డిమానిటైజేషన్ వేరే చెప్పక్కర్లేదు. పెళ్లి వాయిదా వేసుకోవడం ఇష్టం లేక సాదాసీదా చేసుకున్నారు. సరిగ్గా అలాంటి మ్యారేజీ ఇది కూడా.