కొడిగట్టిన ఉర్దూ సాహిత్యానికి ఊపిరిలూదుతున్న ఆంట్రప్రెన్యూర్

భాష కోసం జీవితం కేటాయిస్తున్న అంట్రప్రెన్యూర్

కొడిగట్టిన ఉర్దూ సాహిత్యానికి ఊపిరిలూదుతున్న ఆంట్రప్రెన్యూర్

Friday March 11, 2016,

4 min Read


"మడిసన్నాక కూసింత కలాపోసనుండాలి .." ఈ మాట ఏ సందర్భానికి రాసినా... రాసుకున్న సందర్బాన్ని బట్టి అర్థం మారిపోతూ ఉంటుంది. వెటకారమనుకుంటే వెటకారం.. సీరియస్ అనుకుంటే సీరియస్. వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో పైకెదిగి మానసిక ఆనందం కోసం ఇష్టమైన వ్యాపకాల్ని అంతే నిష్టతో చేపడుతూంటారు అనేక మంది. వీటిలో వ్యాపారాలు ఉంటాయ్..కళలూ ఉంటాయ్... సంఘసేవా ఉంటుంది. 

ఓ బిల్ గేట్స్ ... గేట్స్ ఫౌండేషన్ ద్వారా సేవలు అందించడం...

ఓ రతన్ టాటా .. స్టార్టప్ లను ప్రొత్సహించడం ...

వీరికోవలోకే వస్తారు సంజీవ్ షరాఫ్

ప్రమాదంలో పడిన ఉర్ధూ భాష మనుగడను విశ్వవ్యాప్తంగా చేయడానికి నిరంతరం తపనపడుతున్న వ్యక్తి సంజీవ్ షరాఫ్. పారిశ్రామిక రంగంలో విజయం సాధించి... ఆ తర్వాత తన జీవితాన్ని ఉర్ధూ భాష, సాహిత్యంపై తనకున్న ముక్కువను దాని ఉన్నతి కోసం వెచ్చిస్తున్న నిజమైన కళాపోషకుడు.

వందల ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన భాష ఉర్దూ. అరబిక్, హిందీ, పర్షియన్, ఇంగ్లిష్ లాంటి భాషల సమ్మేళనం. ఢిల్లీ సుల్తానుల, మొఘల్ సామ్రాజ్యపు అధికార భాషగా విరాజిల్లింది. స్వాతంత్రోద్యమంలో నినాదాలు, పద్యాలు, కవితలు, గేయాలు ఉర్దూ భాష లోనివే. హస్రత్ మోహానీ, రాంప్రసాద్ బిస్మిల్, ముహమ్మద్ ఇక్బాల్, గాలిబ్ కవితలు ఉద్యమాన్ని ఎంతో ప్రభావితం చేసాయి. స్వతంత్ర భారతదేశంలో అధికారభాష ప్రకటనా సమయంలో హిందీ భాషకు సమానంగా ఉర్దూకూ ఓట్లొచ్చాయి, పార్లమెంటులో హిందీ భాష ఆమోదం పొందింది. అలాంటి భాషను ప్రపంచీకరణ ప్రమాదంలో పడేస్తోంది. ఇంగ్లీష్ .. ఇతర భాషల్లానే ఉర్దూనూ మింగేస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. అందుకే సంజీవ్ షరాఫ్ "రేఖ్తా"ను స్థాపించారు. ఉర్దూ భాషకు పూర్వవైభవం తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

భాషకి శ్వాస రేక్తా

మూడేళ్ల క్రితం ప్యాషన్ తో సంజీవ్ షరాఫ్ ప్రారంభించిన "రేఖ్తా" ఉర్దూ భాషకు వెలుగులా ఉపయోగపడుతోంది. రేఖ్తా వెబ్ సైట్ లో 4,300 ఆడియో పద్యాలు, 4,100 వీడియో పద్యాలు, 17వేల ఈ బుక్స్ ఉన్నాయి. 1,700 మంది కవుల సాహిత్యం, 35,000 గజల్స్ రోమన్, దేవనాగరి, ఉర్దూ భాషల్లో రేక్తాలో అందుబాటులో ఉన్నాయి. రేఖ్తాకు అన్ని వయసుల వాళ్లూ అభిమానులుగా మారిపోయారు. స్కూలు, కాలేజీ విద్యార్థులు ఉర్దూ సాహిత్యానికి ఆకర్షితులవుతున్నారు. ఇక పెద్దవాళ్ల అభిమానానికి హద్దే లేదు. తమ జీవితంలో ఉర్దూ భాష ప్రాభవం తగ్గడం, నిర్లక్ష్యం చేయడాన్ని చూసిన వారు రేఖ్తా కృషిని అభినందించకుండా ఉండలేకపోతున్నారు. వారంతా ఇప్పుడు రేఖ్తా సాయంతో ఉర్దూ సాహిత్యాన్ని అస్వాదిస్తున్నారు.

క్షణం.. క్షణం ఒత్తిడితో బిజీ ప్రపంచంలో గడుపుతున్న అనేక రంగాల ప్రజలు మానసిక ఉల్లాసం, రిలీఫ్ కోసం రేఖ్తా వైపు చూస్తున్నారు. ఉర్దూభాషలో ఉన్న మాధుర్యంతో మనసు తేలికపరుచుకుంటున్నారు. 

image


ఎవరీ సంజీవ్ షరాఫ్..?

1980ల్లోనే ఐఐటీ ఖరగ్ పూర్ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేసిన వ్యక్తి సంజీవ్ షరాఫ్. చదువైన తర్వాత పాలిప్లెక్స్ అనే సంస్థను స్థాపించారు. దాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. పాలిప్లెక్స్ కార్పొరేషన్ ఇప్పుడు థిన్ పాలియస్టర్ ఫిల్మ్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే నాలుగో స్థానంలోఉంది. భారత్, థాయ్ లాండ్, టర్కీల్లో ఈ సంస్థ ఉత్పత్తి కేంద్రాలున్నాయి. పాలిప్లెక్స్ బ్రాండ్ ను బిల్డ్ చేసిన సంజీవ్ షరాఫ్ ఆ తర్వాత మెల్లగా తనకిష్టమైన రంగంలోకి వచ్చారు. ఉర్దూ సాహిత్యంతో మమేకమయ్యారు. ఉర్దూ ఎందుకు వెనుకబడిపోతోందో... కొంత పరిశోధన చేశారు. ఆ పరిస్థితులను మార్చేందుకు "రేఖ్తా"ను స్థాపించారు.

" పాలిప్లెక్స్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మరింత సార్థకంగా ఉండే పని ఏదైనా చేయాలనుకున్నాను. చిన్నప్పటి నుంచి ఉర్దూ భాషపై ప్రత్యేకమైన అభిమానం ఉంది. దీనిలోని భావ వ్యక్తీకణ, డిక్షన్ ను అద్భుతం. అందుకే దీన్ని దేశంలో మరెంతో మందికి అందుబాటులోకి తేవాలని నిర్ణయించుకున్నాను" సంజీవ్ షరాఫ్

రేక్తా కార్యక్రమంలో జావెద్ అఖ్తర్<br>

రేక్తా కార్యక్రమంలో జావెద్ అఖ్తర్


ఉర్దూకి మరో పేరే రేఖ్తా. సమ్మిళితం అనే అర్థం కూడా వస్తుంది. గత మూడేళ్లుగా ఉర్దూ సాహిత్యం మీద సంజీవ్ షరాఫ్, అతని బృందం పరిశోధన చేస్తోంది. ఆణిముత్యాల్లాంటి కథలనూ కావ్యాలనూ వెలుగులోకి తెస్తోంది. రచయితలు, పరిశోధకులు, విద్యావేత్తలు వీరికి సాయం చేస్తున్నారు. రేక్తా ఇప్పుడు ఉర్దూ సాహిత్యంలో అత్యంత అరుదైన ఆర్కైవ్స్ ని వెలుగులోకి తెస్తోంది. ఓ డిక్షనరీని కూడా రేక్తా అందుబాటులోకి తెచ్చింది. ప్రతీపదానికి అర్థం తెలిపేలా దీన్ని రెడీ చేశారు. ప్రొఫెషనల్ ఆర్జేలు, గాయకులు, నటులతో ఉర్దూ సాహిత్యాన్ని డిజిటలైజ్ చేస్తున్నారు. కొత్త తరానికి గజల్స్, నజమ్స్ మాధుర్యాన్ని రుచిచూపిస్తున్నారు. దీని ఫలితం ఇప్పుడు 160 దేశాల్లో రేఖ్తాకు అభిమానులు ఉన్నారు. రెగ్యులర్ గా రేఖ్తా వెబ్ సైట్ ను ఫాలో అవుతారు. ఉర్దూని చదువుతారు. గజల్స్ వింటుంటారు.

ఇద్దరు ఉర్దూ దిగ్గజ కవులు మీర్జా గాలిబ్, మిర్ తాఖి మిర్ సాహిత్యాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేశారు. సాదత్ హసన్ మంటో షార్ట్ స్టోరీస్ ని భావితరాలకు అందుబాటులోకి తెచ్చారు. రేఖ్తాతో పాటు "రేఖ్తా" అనే మరో కొత్త కార్యక్రమాన్నీ ప్రారంభించారు. ఇది భాష వ్యక్తీకరణ, మేనరిజమ్స్, మానవ సంబంధాలు తదితర వాటిపై రేక్తిలో చర్చిస్తారు.

జాషన్-ఏ-రేక్తా కార్యక్రమం<br>

జాషన్-ఏ-రేక్తా కార్యక్రమం


ప్రత్యేక కార్యక్రమాలు

రేఖ్తా ద్వారా సంజీవ్ షరాఫ్ ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూంటారు. యువ ఉర్దూ కవుల్ని, కళాకారుల్ని ప్రొత్సహిస్తూంటారు. జాషన్ - ఏ - రేఖ్తా పేరుతో ఉర్దూ ఉత్సవాల్ని ఏర్పాటు చేస్తారు. ప్రదర్శనలు, ప్యానల్ డిస్కషన్లు, ఉర్దూ కవులతో ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహిస్తారు. గత ఏడాది ప్రారంభించిన ఈ జష్న్-ఏ-రేఖ్తా కార్యక్రమాల్లో ఉపఖండం నుంచి పదిహేను వేల మందికిపైగా ఉర్దూ ప్రేమికులు భాగం పంచుకున్నారు. భారత్, పాకిస్థాన్ లకు చెందిన కవులు, కళాకారులు, బాలీవుడ్ సెలబ్రిటీస్ వీటిలో పాలు పంచుకుంటున్నారు.

రేక్తా కార్యక్రమంలో నందితా దాస్<br>

రేక్తా కార్యక్రమంలో నందితా దాస్


అందరికీ అందుబాటులో ఉర్దూ

రేఖ్తా ఫౌండేషన్ ఇప్పుడు ఉర్దూ భాషను అందరూ సులువుగా మాట్లాడుకునేలా చేసే లక్ష్యంతో పనిచేస్తోంది. విద్యావంతులు, పరిశోధకులు విద్యార్థులు, భాషా ప్రేమికుల సహకారంతో రేఖ్తా ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా ఉండాలని సంజీవ్ షరాఫ్ కోరుకుంటున్నారు. 

"మనం ఇక్కడ్నుంచి ఎక్కడికి వెళ్తామో తెలియదు. ఇప్పుడు మనం ఉర్దూకి చేయగలిగినంత చేయడం...ఉర్దూ భాషను అస్వాదించడం. ఉర్దూ భాష కోసం ఎన్నో ప్రాజెక్టులు మదిలో ఉన్నాయి. చాలా పెద్ద కలలు ఉన్నాయి. అవన్నీ చేయడానికి ఈ జీవితం సరిపోదేమో.." సంజీవ్ షరాఫ్ 

image