మురికినీళ్ల‌ను నిమిషాల్లో మంచినీళ్లుగా మార్చే టెక్నిక్‌

మాయామశ్చీంద్ర కాదు.. సైన్స్ చేసిన అద్భుతంరూ. 1000కే పరికరాన్ని అందిస్తున్న హీలియోజ్

మురికినీళ్ల‌ను నిమిషాల్లో మంచినీళ్లుగా మార్చే టెక్నిక్‌

Friday July 24, 2015,

3 min Read

సైన్స్ చేసిన‌ అద్భుతం

ఓ బాటిల్ తీసుకోండి. దాన్నిండా మురికి నీరు నింపండి. కొంతసేపు ఎండలో ఉంచండి. శుభ్రంగా మారిన ఆ నీళ్ల‌ను తాగండి. ఇలా చెబితే ఎవ‌రైనా తాగుతారా? పోనీ అట్లీస్ట్ నమ్ముతారా? కానీ న‌మ్మాలి. న‌మ్మి తీరాలి! ఎందుకంటే మాయామ‌శ్చీంద్రా కాదు. పూర్తిగా సైన్స్ తో ముడిపడిన అంశం. అలా అన్నాం క‌దాని- నీటిని మరిగించడం, వాటిలో క్లోరిన్ బిళ్లలు కలపడం గ‌ట్రా చేయ‌రు. సోడిస్ (ఎస్ఓడీఐఎస్) పద్ధతిలో సూర్యరశ్మి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు నీటిలోకి ప్ర‌వేశించేలా చేస్తారు. త‌ద్వారా నీటిలోని క్రిములను చనిపోతాయి. ఈ పద్ధతిని యునిసెఫ్, డబ్ల్యూహెచ్ఓ, రెడ్ క్రాస్ వంటి సంస్థలు కూడా పరిశీలించాయి. ఆమోదించాయి. సోడిస్ పద్ధతి ప‌క్కా సైంటిఫిక్‌. కానీ ఎలాంటి నీటిని తీసుకోవాలి? ఎంత సేపు ఎండలో ఉంచాలి? వీటిపైన స్ప‌ష్ట‌మైన‌ అవగాహన ఉండాలి.

ఏడుపు మొహం న‌వ్వేస్తుంది !

హీలియోజ్. ఒక‌ ఆస్ట్రేలియన్ సోషల్ ఎంట్రప్రైజ్. “వాడి” అంటే.. వాటర్ డిస్-ఇన్ఫెక్షన్. ఈ పరికరాన్ని క‌నిపెట్టి సోడిస్ పద్ధతిలో నీటిని శుద్ధి చేయడంపై అవగాహన కల్పిస్తోందా సంస్థ‌. అయితే ఇందుకు చేయాల్సింద‌ల్లా ఒక‌టే. టూల్‌ని సీసా మూత‌కు బిగించాలి. ఆ నీటిని ఎండలో ఉంచాలి. కొద్ది సేప‌టి త‌ర్వాత “వాడి” పై ఉన్న ఏడుపు ముఖం పిక్చ‌ర్ మెల్లిగా స్మైలీగా మారుతుంది. అంటే నీళ్లు శుభ్ర‌మయ్యాయ‌ని దాన‌ర్ధం.

50శాతం రోగాలు మాయం

భారత్, ఆఫ్రికా దేశాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకుని “వాడి” పనితీరును, కెపాసిటీని పూర్తి స్థాయిలో పరీక్షించింది హీలియోజ్. ఆ తర్వాత లక్ష్యం హెచ్ఐఎస్ (హెల్త్ ఇంపాక్ట్ స్టడీ). అంటే “వాడి”తో శుద్ధి చేసిన నీటినీ తాగడం ద్వారా మెరుగ‌వుతున్న ఆరోగ్యంపై ప్ర‌జ‌ల్లో అవగాహన కల్పించ‌డం. కలుషిత నీటి నుంచి వచ్చే దాదాపు 50 శాతం జబ్బులను “వాడి” ద్వారా అరికట్టవచ్చని ప్రయోగాత్మకంగా నిరూపించి, దాని సామర్థ్యాన్ని ప్రచారం చేయడమే ఈ స్టడీ లక్ష్యం. అంతేకాదు “వాడి” పరికరాలను అమ్మడానికి చిన్న ఫ్రాంచైజీలు, శుద్ధి చేసిన నీటిని అందుబాటు ధరలో అమ్మేందుకు చిన్న చిన్న స్టాళ్లను ఏర్పాటు చేయడం తద్వారా కొంతమందికి ఉపాధి కూడా కల్పించడం సంస్థ‌ మ‌రో ఉద్దేశం. ముఖ్యంగా మహిళలకు ఆర్ధిక స్వావ‌లంబ‌న ఇవ్వ‌డం దీని కాన్సెప్టు.

image


ఇదొక మంచి ప‌రిక‌రం

ఏటా సుమారు 3.77 కోట్ల మంది భారతీయులు స్వచ్ఛమైన తాగునీరు లేక రోగాల‌ పాలవుతున్నారు. కోటిన్నర మంది పిల్లలు డయేరియా బారినపడి చనిపోతున్నారు. ఇది అత్యంత క‌ల‌వ‌ర‌పెట్టే అంశం. దీనివల్ల కలుగుతున్న నష్టం అంచనా 600 మిలియన్ డాలర్లు. “ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి “వాడి” ఉపయోగపడుతుంది. నీటి ద్వారా వ్యాపించే రోగాలను అరికట్టడానికి ఇది ఓ మంచి పరికరం అని మేం కచ్చితంగా చెప్పగలం” అని ధీమా వ్యక్తం చేస్తున్నారు హీలియోజ్ వ్యవస్థాపకుడు మార్టిన్ వెసియాన్.

ఒరిస్సాలో ప్రయోగాత్మకంగా..

హెచ్ఐఎస్ ను పూర్తి స్థాయిలో నిర్వహించాలంటే డ‌బ్బు పెద్ద‌మొత్తంలో కావాలి. సుమారు 1.35 లక్షల డాలర్ల నిధులు సమీకరించాలి. దీనికోసం హీలియోజ్... క్రౌడ్ ఫండింగ్ ఏజెన్సీ ఇండీగోగోతో జతకట్టింది. ఫ‌లితంగా అనుకున్న దానికన్నా ఎక్కువ నిధులే సమకూరాయి. ప్ర‌స్తుతం ఒరిస్సాలో ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. హెచ్ఐఎస్ ను పూర్తి చేయడంతో పాటు “వాడి”ని మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి అవసరమైన ప్రణాళికలపై కూడా హీలియోజ్ దృష్టి సారించింది. దీనికోసం చర్చలు జరుగుతున్నాయి. వీలైనంత తక్కువ ధరకి ఈ పరికరాన్ని ప్రజలకు అందించాలనేది సంస్థ‌ లక్ష్యం. ప్రస్తుతం “వాడి” తయారీకీ రూ.1000 వరకూ ఖర్చవుతోంది. దాన్ని రూ.600 కి తీసుకురాగలిగితే మేం అనుకున్నది సాధించినట్లే అంటోంది హీలియోజ్‌. ఒక్కసారి కొనుక్కుంటే చాలు. మెయింటెనెన్స్ అవ‌స‌రం లేదు. రెండేళ్ల గ్యారెంటీ. ఏ సమస్యలొచ్చినా రీప్లేస్ చేస్తాం అంటున్నారు సంస్థ ప్ర‌తినిధి గెరాల్డ్ ఎంజింగర్.

image


గుడ్ లక్ హీలియోజ్.

భారత ప్రభుత్వంతో అంగీకారం కుదిరితే సబ్సిడీ ధరలో “వాడి”ని అందించేందుకు హీలియోజ్ ప్రయత్నాలు చేస్తోంది. “వాడి”ని పూర్తి స్థాయిలో భారత్ లోనే తయారు చేయగలిగితే ప్రొడ‌క్ష‌న్ కాస్ట్ తగ్గించవచ్చు. ప్రస్తుతం “వాడి” తయారీకి కావలసిన కొన్ని భాగాలు మాత్రమే ఇక్కడ తయారవుతున్నాయి. మిగిలినవి దిగుమతి చేసుకుంటున్నాం” అంటున్నారు ఎంజింగర్. మంచి ఉద్దేశంతో ప్రారంభించిన‌ వీరి ప్రాజెక్టు విజయవంతమైతే భారతదేశ‌ ప్రజలు సురక్షిత మంచినీటి కోసం ఎదురు చూడాల్సిన అవ‌స‌రం లేదు. గుడ్ లక్ హీలియోజ్.