సామాజిక క‌ట్టుబాట్ల‌పై ఓ మెజిస్ట్రేట్ అలుపెరుగ‌ని పోరాటం

సామాజిక క‌ట్టుబాట్ల‌పై ఓ మెజిస్ట్రేట్ అలుపెరుగ‌ని పోరాటం

Saturday January 16, 2016,

2 min Read

చ‌రిత్ర‌లో మ‌నిషికీ మ‌నిషికీ మ‌ధ్య ఉన్న అవాంత‌రాల‌ను తొల‌గించ‌డానికి పాటుబ‌డిన వాళ్లు ఉన్నారు. సామాజిక చైతన్యంతో అణ‌గారిన వ‌ర్గాల‌కు ఆస‌రాగా మారిన ధ‌న్య‌జీవులు కూడా ఉన్నారు. మూఢ‌విశ్వాసాల‌తో ఊళ్ల నుంచి జ‌నాన్ని వెలివేస్తుంటే వాళ్ల‌లో చైత‌న్యం క‌లిగించిన వ్య‌క్తులూ ఉన్నారు. ఇలా ప్ర‌తీ అంశంలో మ‌నం ఉండేవారు అనే చెప్పుకుంటున్నాం. ఎందుకంటే.. ఇవాళ్టి రోజున ఇన్ని ల‌క్ష‌ణాలు క‌లిగిన వారిని చూడటం చాలా అరుదైన సంగ‌తి. కానీ.. ఇవాళ సామాజిక క‌ట్టుబాట్ల పేరుతో జ‌రుగుతున్న దురాచారాల‌పై అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్న ఒక వ్య‌క్తిని మీకు ప‌రిచ‌యం చేయ‌బోతున్నాం.

అది బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా. సామాజిక క‌ట్టుబాట్ల‌కు, కుల, వ‌ర్గ పోరాటాల‌కు, తెగ‌ల మ‌ధ్య ఆధిప‌త్య‌పోరుకు నెల‌వైన ప్రాంతం. అలాంటి ప్రాంతంలో చైత‌న్య‌స్ఫూర్తిని ర‌గిలించే కార్య‌క్ర‌మాలు ఇప్పుడిప్పుడే మొద‌ల‌వుతున్నాయి. ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న‌ స్కూళ్ల‌కు పిల్ల‌లు వెళుతున్నారు. చ‌క్క‌గా చ‌దువుకుంటున్నారు. కానీ.. ఈ వెలుగుల మ‌ధ్య ఎక్క‌డో చీక‌ట్లో పాత‌కాల‌పు వాస‌న‌లు, క‌ట్టుబాట్లు ఇంకా మిణుకుమిణుకుమంటూనే ఉన్నాయి. ఏళ్లుగా మ‌న‌సుల్లో నాటుకుపోయిన విష‌బీజాలు ఇప్ప‌టికీ అప్పుడ‌ప్పుడూ బ‌య‌ట‌ప‌డుతూనే ఉన్నాయి.

రాజ్‌పుట్‌లు ఎక్కువ‌గా ఉండే.. క‌ళ్యాణ్‌పూర్ ఏరియాలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో సునీతా కువార్ అనే వితంతువు అక్క‌డి పిల్ల‌ల‌కు మ‌ధ్యాహ్న భోజ‌నం వండిపెడుతోంది. అది ఊరి జనానికి న‌చ్చ‌లేదు. అంతే.. దాదాపు 150మంది ఊరి జ‌న‌మంతా ఏక‌మ‌య్యారు. స్కూలుమీద‌కు దండ‌యాత్ర చేశారు. భ‌ర్త చ‌నిపోయిన నువ్వు మా పిల్ల‌ల‌కు అన్నం ఎలా వండుతావ‌ని, అది అప‌శ‌కున‌మ‌ని హేళ‌న‌చేసి, వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయారు. కొన్నిరోజుల పాటు త‌మ పిల్ల‌ల‌ను స్కూలుకు కూడా వెళ్ల‌నీయ‌లేదు.

image


ఈ ఘ‌ట‌న జ‌రిగిన కొన్ని నెల‌ల త‌ర్వాత గోపాల్‌గంజ్ జిల్లా మెజిస్ట్రేట్ రాహుల్‌కుమార్‌కు విష‌యం తెలిసింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న స‌మాజంలో ఇలాంటి చీద‌రింపులు, ఛీత్కారాలు, అంట‌రానిత‌నం మంచిది కాద‌ని.. వాళ్ల‌లో చైత‌న్యం తీసుకురావాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అనుకుందే త‌డ‌వుగా జిల్లా విద్యాశాఖాధికారుల‌తో క‌లిసి స్కూలుకు వెళ్లి ఉన్న ప‌దిమంది పిల్ల‌ల‌తో క‌లిసి తానూ నేల‌పై కూర్చుని సునీతా వండిన భోజ‌నాన్ని తానూ తిన్నారు. ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఆమె ఇక్క‌డే ప‌నిచేయాల‌ని.. దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపించాల‌ని ఆదేశించారు. గ్రామ‌స్తుల్లో చైత‌న్యం తీసుకువ‌చ్చేందుకు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు.

image


ప్ర‌స్తుతానికి సునీతా అదే స్కూల్‌లో ప‌నిచేస్తోంది. కానీ. ఆమెకు వ్య‌తిరేకంగా గ్రామ‌స్తులు చేస్తున్న పోరాటం ఆమె గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఓ వైపు అధికారులంతా ఆస‌రాగా ఉన్న భ‌రోసా ఉన్నా.. ఏ క్ష‌ణంలో ఏం జ‌రుగుతుందోన‌న్న భ‌యం ఆమెను నిత్యం వెంటాడుతోంది.