మన ఆంట్రప్రెన్యూర్లు ప్రపంచాన్నే శాసించాలి..!

మన ఆంట్రప్రెన్యూర్లు ప్రపంచాన్నే శాసించాలి..!

Saturday January 16, 2016,

2 min Read

ఇండియన్ ఆంట్రప్రెన్యూర్లకు ఆకాశమే హద్దు అన్నారు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ. స్టార్టప్స్ విషయంలో ఎలాంటి ప్రభుత్వ జోక్యం ఉండదన్నారు. అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్టార్టప్ ఇండియా కార్యక్రమం ముఖ్యాంశాలను సన్నాహక సభలో అరుణ్ జైట్లీ వివరించారు.

image


ముఖ్యంగా లైసెన్స్ విధానంపై కఠినంగా వ్యవహరించబోమని అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. బ్యాంకులు ఉదారంగా రుణాలు ఇచ్చేలా రిజర్వ్ బ్యాంకు ప్రోత్సహిస్తుందన్నారు. భారతీయ వ్యవస్థాపకులను ప్రొత్సహించే ఉద్దేశంతో శ్రీకారం చుడుతున్న సార్టప్ ఇండియాతో దేశంలో గణనీయమైన మార్పు వస్తుందన్నారు. అధిక జనాభా ఉన్న భారత్ లాంటి దేశానికి ఆంట్రప్రెన్యూర్ షిప్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. భారత ఆంట్రప్రెన్యూర్లకు ఇదొక శుభదినంగా జైట్లీ అభివర్ణించారు. స్టార్టప్స్ కు ప్రభుత్వం ఒక ఫెసిలిటేటర్ గా మాత్రమే ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. స్టార్టప్స్ రోజువారీ కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం ఉండదని స్పష్టం చేశారు. అప్పుడే స్టార్టప్స్ వేగంగా వృద్ధిలోకి వస్తాయని జైట్లీ అభిప్రాయ పడ్డారు. పారిశ్రామికవేత్తలను ఇబ్బంది పెట్టిన లైసెన్స్ రాజ్ కు 1991లో చెల్లుచీటి ఇచ్చామని చెప్పుకొచ్చారు. కానీ ఆ బ్రేక్ ప్రభావం పాక్షికంగానే ఉందని తెలిపారు.

విదేశీ పెట్టుబడులు రావడం ఇప్పటికీ కష్టంగానే ఉందన్న జైట్లీ.. క్లియరెన్సులు, ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్, ఇంకా ఇతరత్రా అంశాలు ఇండియన్ ఆంట్రప్రెన్యూర్లకు ఇప్పటికీ అవరోధంగానే ఉన్నాయన్నారు. స్టార్టప్స్ ను పుష్ చేయడానికి ప్రభుత్వం గత ఏడాదిగా అనేక చర్యలు తీసుకుంటున్నదని జైట్లీ తెలిపారు. ఆంట్రప్రెన్యూర్లకు భారతదేశం స్వర్గధామమని తెలిపారు. ట్యాక్స్ ఫ్రెండ్లీ విధానం తీసుకొచ్చామని.. టెక్నాలజీ, ఇన్నోవేషన్ విషయంలోనూ సహకారం అందిస్తున్నామని తెలిపారు జైట్లీ. 

అవకాశాల విషయంలో ఇండియన్ ఎంట్రప్రెన్యూర్లకు ఇక ఆకాశమే హద్దు అని చెప్పారు. గతంతో పోలిస్తే పరిస్థితి ఇప్పుడు చాలా బెటర్ గా ఉందని అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ ద్వారా ప్రపంచమంతా ఇప్పుడు మరింతగా ఇంటర్ కనెక్ట్ అయిఉంది కాబట్టి.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించినా.. ఇండియన్ ఎకానమీ మాత్రం పెరుగుతూనే ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. విదేశీ పెట్టుబడుల కోసం ఇండియా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు కల్పించలేదు కాబట్టే.. మరింతగా ఆంట్రప్రెన్యూర్లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

సమాజంలో అట్టడుగున ఉన్న 25 శాతం జనాభా కోసం ముద్ర స్కీమ్ తీసుకొచ్చామని ఈ సందర్భంగా జైట్లీ గుర్తు చేశారు. మద్ర పథకం కింద 1.73 కోట్ల మంది ఆంట్రప్రెన్యూర్లకు లబ్ది చేకూరిందని చెప్పారు. దాని ఫలితాలను బట్టే కేంద్రం స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చిందని స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళలు, ఎస్సీ, ఎస్టీ సెగ్మెంట్ల నుంచి ఆంట్రప్రెన్యూర్లను తయారుచేయడమే స్టార్టప్ ఇండియా లక్ష్యంమని జైట్లీ చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వం తరఫు నుంచి మూడు వేల మంది కొత్త ఆంట్రప్రెన్యూర్లను తయారు చేయాలన్నది ప్రధాని మోడీ లక్ష్యమన్నారు జైట్లీ. 

దేశ జనాభా రోజురోజుకూ పెరుగుతోంది కాబట్టి.. ప్రతీ ఆంట్రప్రెన్యూర్ కు ప్రభుత్వం సహకరించాలంటే సాధ్యమయ్యే పనికాదన్న జైట్లీ.. బయటనుంచి కూడా ఆంట్రప్రెన్యూర్లు తయారుకావాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. ఐడియాలతో సంపద సృష్టిస్తున్న సిలికాన్ వ్యాలీలోని భారతీయులను ఇక్కడి ఆంట్రప్రెన్యూర్లు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఇండియన్ ఆంట్రప్రెన్యూర్లు ప్రపంచాన్ని శాసించేవిధంగా ఉండాలని, వాళ్లంతా దేశానికి గర్వకారణంగా నిలవాలని స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు అరుణ్ జైట్లీ.